'హోదా' ఆత్మరక్షణలో మోడీ: వెంకయ్య-నిర్మలా సీతారామన్ సేఫ్!
న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు పంపించే వారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణ కోణంలో ఆలోచిస్తోందా? కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్లకు చిక్కులు లేకుండా చూస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తోంది.
ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మూడు టిడిపికి, ఒకటి వైసిపికి దక్కనుంది మూడింటిలో రెండు టిడిపికి దక్కుతాయి. ఒకదానిని మిత్రపక్షం బీజేపీకి చంద్రబాబు ఇవ్వనున్నారు. బీజేపీకి కేటాయించే స్థానంలో తొలుత వెంకయ్య పేరు, ఆ తర్వాత ప్రధానంగా నిర్మలా సీతారామన్ పేరు వినిపించింది.
కానీ, బీజేపీ అనూహ్యంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పేరును తెరపైకి తీసుకు వచ్చింది. ఇందుకు బీజేపీ ఆత్మరక్షణ ధోరణియే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రులు స్పష్టం చేశారు. తెలుగువాడైన వెంకయ్య నాయుడు కూడా.. హోదాపై దాదాపు ఆశలు పెట్టుకోవద్దు అన్నట్లుగా మాట్లాడారు. హోదా ఇవ్వకుంటే ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే తెలుగు వారికి చిక్కులు తప్పవు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనుందున ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వెంకయ్య, నిర్మలలు రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపించవచ్చు. వారి రాజీనామా కోసం విపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా సురేష్ ప్రభు పేరును తెరపైకి తీసుకు వచ్చి ఉంటుందని అంటున్నారు.
సురేష్ ప్రభును ఏపీ నుంచి బరిలోకి దింపాలనుకోవడం ద్వారా.. విశాఖకు హామీ ఇచ్చినట్లుగా రైల్వే జోన్ త్వరలో సాకారం అవుతుండవచ్చునని అంటున్నారు. సురేష్ ప్రభు వచ్చే రైల్వే బడ్జెట్లో రైల్వే జోన్ హామీ నెరవేర్చుకుంటే ఆయనను రాజీనామాకు డిమాండ్ చేసే అవకాశాలు తక్కువ.
అంతేకాదు, ఆయన ఏపీ వాడు కాదు కాబట్టి ఆయన పైన ఎక్కువ ప్రభావం ఉండదు. ఈ కోణంలో ఆలోచించే బీజేపీ పావులు కదిపి ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు సురేష్ ప్రభు పేరును ఏపీ నుంచి ఖరారు చేసి బీజేపీ ప్రకటించలేదు. కానీ అంతర్గతంగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.