ఎత్తులు చిత్తు!: కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద కథ, ఏం జరిగింది?
విజయవాడ: టిడిపి నేత, ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రావెల్స్ నిర్వహిస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విమర్శిస్తున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకే తాను సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. 170 బస్సులను అమ్మకానికి పెట్టామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ట్రావెల్స్ మూసివేత వద్దని వారించారని, అయినా తాను ఈ వ్యాపారంలో కొనసాగేందుకు ఇష్టపడలేదని నాని తెలిపారు. అక్రమ పద్ధతుల్లో బస్సులను నడుపుతూ తానేనాడూ లాభాలను ఆర్జించలేదన్నారు.
ఇంతకాలం తనను నమ్మి, తన వెన్నంటి ఉన్న సంస్థ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అయితే, ట్రావెల్స్ మూసివేతపై సంస్థ ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చారు. కేశినేని ట్రావెల్స్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ట్రావెల్స్ మూసివేత వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.
చేతులెత్తేసిన కేశినేని నాని
కేశినేని నాని చేతులెత్తేశారు. వేసిన ఎత్తులు పారకపోవడంతో కేశినేని ట్రావెల్స్ను మూసివేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ట్రావెల్స్ను మూసి వేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా ఏళ్లుగా కేశినేని ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. దాదాపు 450 సర్వీసులను కేశినేని ట్రావెల్స్ నడుపుతోంది. అర్థరాత్రి నుంచి ట్రావెల్స్ను నిలిపివేశారు. విజయవాడతో పాటు ముఖ్యపట్టణాల్లోని కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను మూసివేశారు. బోర్డులను కూడా తొలగించారు.
ఎన్నో కారణాలు
కేశినేని ట్రావెల్స్ను ఇలా హఠాత్తుగా మూసివేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు నాని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయట. కొద్దికాలంగా ట్రావెల్స్ను నడిపేందుకు కేశినేని సంస్థ ఆపసోపాలు పడుతోందని అంటున్నారు. కొన్నేళ్లుగా భారీ నష్టాలను మూటకట్టుకుందని చెబుతున్నారు. రేటింగ్లోనూ చాలా వెనుకబడిపోయిందట. ఒక దశలో నెలల జీతాలు రాకపోవడంతో సిబ్బంది ధర్నాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితమే 170 బస్సులను నాని అమ్మేశారని, అయినా పరిస్థితిలో మార్పు రాలేదని ప్రచారం సాగుతోంది.
ఊపిరి పోద్దామనుకుంటే..
ప్రస్తుతం ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. దీంతో ట్రావెల్స్కు ఊపిరిపోయాలని భావించారని, ఇందులో భాగంగానే రేటింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్కు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలంటూ విజయవాడ ఆర్టీవో కమిషనర్ బాలసుబ్రమణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా కలిసి దౌర్జన్యం చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఆ ఎత్తులు చిత్తు!
ఆర్టీవో అధికారి బాలసుబ్రమణ్యంపై దౌర్జన్యం అంశం పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. ఆరెంజ్ ట్రావెల్స్కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీ అనుచరులు ఒత్తిడి తెచ్చారని అధికారులు చెప్పడంతో నాని ఎత్తులు పారలేదని అంటున్నారు.
మూసివేత
ఆ సంఘటన తర్వాత కేశినేని ట్రావెల్స్ అంశం మరింత చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక సర్వీసులను నడపడం సాధ్యం కాదని భావించిన కేశినేని నాని... దాన్ని మూసివేశారని అంటున్నారు. నిజానికి వారం క్రితమే ట్రావెల్స్ మూసివేతపై కేశినేని ప్రకటన చేస్తారని భావించారు. కానీ అప్పుడు చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించుకుని ట్రావెల్స్ను మూసి వేయవద్దని నానికి సూచించారు. తాజాగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.