మూడేళ్ల తర్వాత ఎటిఎం అటాకర్ గుర్తింపు: అతను సెక్స్ వర్కర్ కూడా...
మూడేళ్ల తర్వాత ఎటిఎం అటాకర్ను బాధితురాలు గుర్తించింది. అతను ఇంతకు ముందు ఇద్దరు మహిళలను హత్య చేయడమే కాకుండా సెక్స్ వర్కర్గా కూడా ఉన్నాడు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎటిఎం కేంద్రంలో తనపై దాడి చేసిన నిందితుడిని బాధితురాలు మూడేళ్ల తర్వాత కూడా గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స ద్వారా కోలుకుంది. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఐడెంటిఫికేషన్ పరేడ్ జరిగింది.
ఆమె పరప్పన అగ్రహార జైలుకు శుక్రవారంనాడు వెళ్లిందని, తనపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించిందని మహిళ భర్త చెప్పారు. ఐడెంటిఫికేషన్ పరేడ్కు గంట కూడా పట్టలేదని అధికారులు అంటున్నారు.
ఐడెంటిఫికేషన్ పరేడ్కు తీసుకుని వెళ్లడానికి ముందు మహిళ నిశబ్దంగా ఉండిపోయిందని, నిందితుడిని గుర్తించగానే ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్లు కనిపించిందని అధికారులు అన్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందినవాడు.
నిందితుడు ఇలా తప్పించుకున్నాడు..
నిందితుడు మధుకర్ రెడ్డి (43) 2011లో కడపలోని ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆ సమయంలో అతను ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. రెండేళ్ల తర్వాత అతను ఎటిఎం కేంద్రంలో మహిళపై దాడి చేశాడు. పోలీసులు తనిఖీ చేస్తుండగా ఫిబ్రవరి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తన సొంత జిల్లా చిత్తూరులో అతను పట్టుబడ్డాడు.
అతను నేరాన్ని అంగీకరించాడు...
బ్యాంక్ అధికారి అయిన మహిళపై బెంగళూరులోని ఎటిఎం కేంద్రంలో తాను దాడి చేసినట్లు పోలీసుల విచారణలో మధుకర్ రెడ్డి అంగీకరించాడు. 2013 నవంబర్ 19వ తేదీన ఎటిఎం కేంద్రంలో మహిళపై కత్తితో అతను దాడి చేశాడు. ఆ దాడి సంఘటన సిసిటీవీ కెమెరాలకు చిక్కింది.
అతను సెక్స్ వర్కర్ కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఇద్దరు మహిళల కేసుల్లో కూడా అతను నిందితుడు. అలాగే అతను తెలంగాణ రాజధాని హైదరాబాదులో సెక్స్ వర్కర్గా జీవితం సాగించినట్లు తెలుస్తోంది. సిసిటీవీ కెమెరాల్లో దాడి ఘటన రికార్డయినప్పటికీ అతను చాలా కాలం పోలీసులకు చిక్కలేదు.
దాడి ఘటనతో తీవ్ర భయాందోళనలు...
మహిళపై ఎటిఎం కేంద్రంలో జరిగిన దాడి ఘటన తీవ్రమైన భయాందోళనలకు గురి చేసింది. బాధితురాలు కార్పోరేషన్ బ్యాంకు ఉద్యోగి. దాడి వల్ల ఆమె కుడి శరీరభాగం చచ్చుపడింది. ఈ ఘటనతో ఎటిఎం కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.