నంద్యాల ఎన్నికలు వాయిదా వేయించే ప్రయత్నంలో వైసీపీ: చంద్రబాబు సంచలనం
ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతో శాంతి భద్రతల సమస్యను తెర పైకి తీసుకొచ్చి ఎన్నికలు వాయిదా వేయించడానికి వైసీపీ చూస్తోందని అన్నారు.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వాయిదా పడేలా చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆయన సూచించారు.
గురువారం టీడీపీ సమన్వయ కమిటీతో భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ సూచనలు చేశారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతో శాంతి భద్రతల సమస్యను తెర పైకి తీసుకొచ్చి ఎన్నికలు వాయిదా వేయించడానికి వైసీపీ చూస్తోందని అన్నారు.
నిజానికి ఎన్నికలు వాయిదా పడటం వల్ల వైసీపీకి కలిగే ప్రత్యేక ప్రయోజనమేమి లేదు. అందుకే తాడో పేడో తేల్చుకోవడానికే ఆ పార్టీ సిద్దపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికలు వాయిదా పడటం టీడీపీకే మేలు చేకూర్చే అంశం. నంద్యాల ప్రజల తీర్పును మూడేళ్ల టీడీపీ పాలనకు రెఫరెండం గాను, భవిష్యత్తు రాజకీయాలకు నాంది గాను ప్రచారం చేస్తుండటంతో.. వ్యతిరేకత కనిపించకుండా ఉండటానికి ఎన్నికల వాయిదా ఉపయోగపడుతుంది.
అయితే గెలుపు పట్ల టీడీపీకి ఉన్న ధీమాతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అనుకోవచ్చు. ఇప్పటికే 15వేల నుంచి 18వేల మెజారిటీ వస్తుందంటూ సర్వేలు చేయించుకున్న టీడీపీ.. దాన్ని మరింత పెంచడం కోసం శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు. అటు వైసీపీలోను గెలుస్తామన్న ధీమా కనిపిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల్లో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.