భూమా లేఖతో హీటెక్కుతోన్న నంద్యాల పాలిటిక్స్..!
నంద్యాల : వైసీపీ నుంచి టీడీపీలోకి కొత్తగా వచ్చి చేరిన ఎమ్మెల్యేలతో పార్టీలో అలజడి రేగుతూనే ఉంది. కొత్తగా వచ్చిన నేతలకు, ముందునుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతలకు మధ్య అంతర్గత వైరం కొనసాగుతోన్న నేపథ్యంలో తాజాగా పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డికి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కుటుంబానికి మధ్యన విభేదాలను ఇటీవలే చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నంద్యాల బస్టాండ్ ఎదురుగా ఖాళీగా ఉన్న రెండెకరాల స్థలాన్ని వేలం వేసి, తద్వారా వచ్చిన నిధులను నంద్యాల అభివృద్దికి ఉపయోగించాలని సీఎం చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి లేఖ రాశారు.
ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ రూ.10 కోట్ల వరకు పలకవచ్చని సమాచారం. కాగా భూమా లేఖపై నియోజకవర్గంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తిని ఇప్పుడు వేలం వేయాల్సిన అవసరమేముందని కొంతమంది ప్రశ్నిస్తుంటే, మరికొంతమంది మాత్రం నిరుపయోగంగా ఉన్న భూమిని పట్టణాభివృద్ధికి వినియోగించడంలో తప్పేముందని వాదిస్తున్నారు.
ఇకపోతే భూమా లేఖపై శిల్పామోహన్ రెడ్డి వర్గీయులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భూమా లేఖతో శిల్పామోహన్ రెడ్డి గనుక విభేదిస్తే.. ఇద్దరి మధ్య అంతర్గత పోరు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.