అక్కడ దహనక్రియలు: భూమి పూజ స్థలం మార్పు?
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూమి పూజకు నిర్ణయించిన వేదిక మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ విషయంపై స్థానికంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎపి రాజధాని అమరావతికి జూన్ 6న భూమి పూజ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనికోసం మందడం శివారు తాళ్లాయపాలెం వద్ద జడ్పీటీసీ నరేంద్రబాబు ఆయన బంధువులకు చెందిన సర్వే నెం.134, 136లోని 20 ఎకరాలకుపైగా భూమిని వేదికగా నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ముందు అక్కడ జరిగిన ఓ సంఘటన గురించి వారు దాచిపెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
ఈ నెల 14న నరేంద్రబాబు సమీప బంధువు బెజవాడ వెంకటేశ్వరరావు సతీమణి ధనలక్ష్మి మృతిచెందారు. రాజధాని భూమిపూజకు వేదికగా నిర్ణయించిన సర్వే నెం.134లోని తమ సొంత భూమిలో కుటుంబసభ్యులు ఆమె భౌతికకాయానికి 15న దహన క్రియలు నిర్వహించారు. అప్పటికింకా భూమిపూజ కోసం ఇంకా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయలేదు.
కానీ ప్రభుత్వం ఇదే భూమిని ఎంపికచేసే ముందర ఆ ప్రజాప్రతినిధి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా మరుగుపరిచారు. విషయం తెలియని ప్రభు త్వం అక్కడే భూమి పూజ జరుగుతుందని ప్రకటించింది. కానీ, ఈ విషయం గురువారం ఒకరిద్దరు మంత్రుల దృష్టికి వెళ్లింది. వారు దీన్ని ధ్రువీకరించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో భూమి పూజ జరిపే స్థలాన్ని మారుస్తారనే ప్రచారం సాగుతోంది.