భూమా ఎఫెక్ట్, అక్కడే చంద్రబాబుకు చిక్కు: శిల్పా... జగన్ పార్టీలో చేరుతారా?
నంద్యాల ఉప ఎన్నికల తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలామంది రేసులో ఉన్నారు. టిడిపిల
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలామంది రేసులో ఉన్నారు. టిడిపిలో పలువురు పోటీ పడుతున్నారు.
నంద్యాల షాక్: అఖిలప్రియపై 'సొంత' పార్టీ పావులు, రంగంలోకి ప్రత్యర్థులు!
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల భూమా నాగిరెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన, ఆయన కూతురు అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే) టిడిపిలో చేరారు. ఇటీవల నాగిరెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అక్కడే చంద్రబాబుకు చిక్కు
నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు రేసులో ఉన్నారు. మాజీ మంత్రి ఫరూక్, శిల్పా మోహన్ రెడ్డి, భూమా కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. భూమా ఫ్యామిలి టీడిపిలో చేరినందున.. ఆయన కుటుంబానికి లేదా అఖిల ప్రియ సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని భూమా వర్గీయులతో పాటు టిడిపిలో ఎక్కువ మంది యోచిస్తున్నారు.
అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి వైసిపి నుంచి పోటీ చేయడంతో, టిడిపి నుంచి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. అప్పుడు తానే పోటీ చేశాను కాబట్టి ఇప్పుడు తమకే అవకాశమివ్వాలనేది శిల్పా వర్గీయుల వాదనగా వినిపిస్తోంది. ఇక్కడే చంద్రబాబుకు చిక్కు వచ్చిందని అంటున్నారు.
చుక్కలు చూపించేనా, శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరేనా?
ఉప ఎన్నికలో పోటీకి శిల్పా మోహన్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయమై తన అనుచరులతో శిల్పా రహస్యంగా భేటీ అయ్యారు. టిడిపి అవకాశమివ్వకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా అనే సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. అలా సాధ్యం కాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. ఎలా పోటీ చేసినా అది తెలుగుదేశం పార్టీకి, అఖిలప్రియకు, చంద్రబాబుకు చుక్కలు చూపించినట్లే అవుతుందని అంటున్నారు.
యూటర్న్ తీసుకుంటారా? జిల్లా నేతల్లో కలవరం
టిడిపి టిక్కెట్ దొరకకుంటే శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరుతారా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన వర్గీయులతో రహస్య భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శిల్పా మోహన్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుంటారా అని టిడిపి గుసగుసలాడుతోంది. ఆయన పార్టీ వీడితే.. భూమా ఫ్యామిలీ పార్టీలోకి వచ్చిన ఫలితం ఉండదని, ప్లస్కు ఇప్పుడు మైనస్ అవుతుందనే ఆందోళన టిడిపిలో ఉంది. దీంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది.
భూమా మద్దతుతో గెలిచారు.. కానీ
టిడిపి తరపున భూమా నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికలో శిల్పామోహన్ రెడ్డికి టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇస్తే తామంతా వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తామని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్ఎండీ ఫరూక్ వర్గానికి చెందిన మండల నాయకులు స్పష్టం చేశారు. అయితే ఫరూక్ తమ అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత శిల్పా బ్రదర్స్ రహస్యంగా భేటీ కావడం కలకలం రేపుతోందని అంటున్నారు.
అయితే, ఇక్కడ ఇంకో విషయం, భూమా వర్గీయులను ఒప్పించి, వారి మద్దతుతో చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. చక్రపాణిని గెలిపిస్తామని భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు చెప్పారు. ఆయన మృతి తర్వాత అఖిల ప్రియ కూడా తన వర్గం వారికి అదే పిలుపునిచ్చారు. ఇటీవలే చక్రపాణి గెలిచారు.. అదీ భూమా వర్గీయుల సహకారంతో.. కాబట్టి శిల్పా వర్గీయులు బెట్టు వీడే అవకాశాలు లేకపోలేదంటున్నారు.