నాన్న చంద్రబాబుకు మాటిచ్చారు: అఖిలప్రియ, ఏ కక్షలు లేవని శిల్పా
తన తండ్రి, దివంగత భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన హామీ మేరకు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించుకుందామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్ర
కర్నూలు/అమరావతి: తన తండ్రి, దివంగత భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన హామీ మేరకు టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపించుకుందామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పిలుపునిచ్చారు.
చక్రపాణి రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో నంద్యాల నియోజక వర్గ ఎంపీటీసీలు, కౌన్సెలర్లు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డితోపాటు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, భూమా రెండో కుమార్తె మౌనికా రెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కార్యకర్తలను కాపాడుకుంటా
భూమా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అఖిల మాట్లాడారు. తన తండ్రి నంద్యాల నియోజక వర్గ నాయకులను, కార్యకర్తలను ఎంతగా ప్రేమించారో అదే స్థాయిలో కంటికి రెప్పలా వారిని తాను కాపాడుకుంటానన్నారు.
శిల్పాను గెలిపించే బాధ్యత మనదే
నంద్యాలలో రోడ్ల వెడల్పు, పదివేల ఇళ్ల నిర్మాణం తన తండ్రి కల అని చెప్పారు. సీఎం ఎం చంద్రబాబుకు తన తండ్రి ఇచ్చిన హామీ మేరకు శిల్పాను గెలిపించే బాధ్యత మన పైన ఉందని చెప్పారు. అదే భూమాకు నిజమైన నివాళి అన్నారు.
అఖిలప్రియతో నమ్మకం..
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నాగిరెడ్డి లేకుండా సమావేశంలో తాను మాట్లాడాల్సి రావడం తన దురదృష్టమన్నారు. అసెంబ్లీలో అఖిల ప్రియ మాట్లాడిన తీరుతో తమకు నమ్మకం కలిగిందన్నారు.
భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలి
భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలను, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని ఫరూక్ అన్నారు. నియోజక వర్గంలో పలు పథకాలకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయ వైరమే కానీ.. కక్షలు లేవు
గతంలో తమకు భూమా నాగిరెడ్డికి మధ్య రాజకీయ వైరమే కానీ, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవని ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. కర్నూలులో భూమా, సుబ్బారెడ్డిలతో మాట్లాడిన అనంతరం తమ మధ్య అంతరాలు తొలగిపోయాయని, భూమా ఇచ్చిన హామీ మేరకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పుకున్నానని చెప్పారు.