అందుకే అసెంబ్లీకి: అఖిల, 'శిల్పాకు రాజకీయ సన్యాసమే', జగన్ ఆశలపై ఈసీ నీళ్లు
తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన రెండు రోజులకే తాను అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టాననే విషయమై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం చెప్పారు.
నంద్యాల: తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయిన రెండు రోజులకే తాను అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టాననే విషయమై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం చెప్పారు.
జగన్ వద్దకు ప్రశాంత్ కిషోర్: బిజెపి నేత ఐడియానా, బాబుకు చెక్?
పార్టీ కార్యకర్తల్లో, తమను నమ్ముకున్న నియోజకవర్గాల్లోని ప్రజల్లో ధైర్యం నింపేందుకు, వారికి భరోసా కల్పించేందుకే అసెంబ్లీలో అడుగు పెట్టానని చెప్పారు.
అసెంబ్లీకి వెళ్తే ప్రశ్నించారు
నంద్యాలలో ఉప ఎన్నికల నేపథ్యంలో టిడిపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడారు. చనిపోయిన మరుసటి రోజే తాను అసెంబ్లీకి వెళ్లడాన్ని పలువురు ప్రశ్నించారని గుర్తు చేశారు.
శిల్పాకు రాజకీయ సన్యాసం తప్పదు
ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన తన సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆమో విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల తర్వాత బాధతో వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు అన్నారు. శిల్పాను బరిలోకి దింపి జగన్ తనకు తానే రాజకీయ సమాధి కట్టుకున్నారన్నారు.
జగన్కు ఈసీ ఝలక్!
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అభివృద్ధి పనుల పేరుతో ఓటర్లను మభ్య పెడుతోందని, బెదిరింపులకు గురి చేస్తోందని వైసిపి నేతలు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమిళనాట ఆర్కే నగర్ ఎన్నిక లాగే నంద్యాల ఉప ఎన్నిక కూడా వాయిదా పడటం లేదా మరేదైనా అనూహ్య సంఘటన జరుగుతుందని వైసిపి అభిమానులు భావించారు. కానీ ఈసీ షాకిచ్చింది. ఓటుపై అపోహలొద్దని, ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమని, ఎప్పుడైనా ప్రకటన వెలువడవచ్చునని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ చెప్పారు.
ఆ తర్వాతే ఓటుపై నిర్ణయం
టిడిపి నేతలు సోమవారం భన్వర్ లాల్ను కలిశారు. నంద్యాలలో 40 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఓటు లేని వారిని గుర్తిస్తామని, వారు ఓటు వేయడానికి వస్తే క్షుణ్ణంగా పరిశీలించి తగు వివరాలు తీసుకున్న తర్వాతనే ఓటుపై నిర్ణయం తీసుకుంటామని భన్వర్లాల్ స్పష్టం చేశారు. ఇటువంటి వారు ఓటు వేయడానికి వచ్చినప్పుడు సంబంధిత బూత్లోని ఏజెంట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఆధార్ లింక్ చేయాలని..
40 వేల నకిలీ ఓట్లకు సంబంధించి ఆధార్ లింక్ చేస్తే బాగుంటుందని టిడిపి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఓటుకు ఆధార్ లింక్ చేసే విషయం సుప్రీం కోర్టులో స్టే ఉందని, ఆ స్టేను తొలగిస్తే తప్ప తాము నిర్ణయం తీసుకోలేమని భన్వర్ లాల్ చెప్పారు.
అధికార పార్టీకే ఓటు అపోహ
భన్వర్ లాల్ మీడియాతో కూడా మాట్లాడారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా అధికార పార్టీకే వెళ్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈవీఎంలకు వీవీపేట్ (ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ట్రైల్)ను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇది ఓటును ఏ గుర్తుకు వేశారో చూసుకోవడానికి ఏడు సెకండ్ల పాటు అలాగే మీట మీద కనిపిస్తుందని, ఆ తర్వాతనే పోలింగ్ బాక్స్లోకి వెళ్తుందన్నారు. ఇలా చేయడంవల్ల వారి అనుమానాలు కూడా నివృత్తి అవుతాయన్నారు. ఉప ఎన్నికలకు సెప్టెంబర్లోపు ఏ రోజైనా తేదీని ఖరారు చేస్తామన్నారు.