సుబ్బారెడ్డిని దూరం చేసుకోను: దెబ్బకు మెట్టు దిగిన అఖిలప్రియ
నంద్యాల టిడిపి సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అలక నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ ఓ మెట్టు దిగారు. ఆమె మెట్టు దిగడానికి పార్టీ అధిష్టానం ఆగ్రహం కూడా కారణమని తెలుస్తోంది.
నంద్యాల: నంద్యాల టిడిపి సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి అలక నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ ఓ మెట్టు దిగారు. ఆమె మెట్టు దిగడానికి పార్టీ అధిష్టానం ఆగ్రహం కూడా కారణమని తెలుస్తోంది. ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారు.
చదవండి: అఖిలకు ఝలక్.. నంద్యాలపై తెరమీదకు కొత్త పేరు
ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు సీరియస్గా ఉన్నారని సమాచారం. శుక్రవారం సాయంత్రం కళా వెంకట్రావు ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఏవీ సుబ్బారెడ్డి అలకపై స్పందించారు.
ఏవీ సుబ్బారెడ్డితో మామ అని పిలిచే చనువు
ఏవీ సుబ్బారెడ్డి అలక చెందాడని తెలిసి అఖిలప్రియ స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి తన ఇంటి మనిషి అని చెప్పారు. ఆయనను తాను మామ అని పిలుస్తానని, అంత చనువు తనకు ఉందని తెలిపారు. తమ మధ్య ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పారు.
మా కుటుంబ వ్యక్తులను దూరం చేసుకునే పరిస్థితుల్లో లేను
తన వైపు పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటానని వ్యాఖ్యానించారు. ఏవీ సుబ్బారెడ్డి తమ కుటుంబంలోని వ్యక్తి అన్నారు. మా కుటుంబంలోని వ్యక్తులను దూరం చేసుకునే పరిస్థితుల్లో తాను లేనని అఖిలప్రియ తేల్చి చెప్పారు. తమ మధ్య ఉన్నది జనరేషన్ గ్యాప్ మాత్రమే అన్నారు.
అప్పుడు స్పందిస్తా..
తనకు ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు లేవని అఖిలప్రియ చెప్పారు. తాను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నానని చెప్పడం సరికాదన్నారు. బహిరంగంగా ఆరోపణలు చేస్తే తాను స్పందిస్తానని, వదంతులు నమ్మవద్దని కోరారు. కార్యక్రమాల్లో పాల్గొనకుండా తాను ఎవరినీ పక్కన పెట్టలేదని అభిప్రాయపడ్డారు.
ఏవీ సుబ్బారెడ్డి సంచలనం
అంతకుముందు, ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భూమా నాగిరెడ్డి తనకు ఇచ్చిన ప్రాధాన్యతలో అఖిలప్రియ 25 శాతం కూడా ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తనను అఖిలప్రియ ఎందుకు పక్కన పెట్టారో తెలియదన్నారు. నంద్యాల టిడిపి కౌన్సెలర్ల మద్దతు తనకే అన్నారు. తనను సుజనా చౌదరి పిలిచి మాట్లాడారని చెప్పారు.
జనరేషన్ గ్యాప్ ఉందేమో.. నంద్యాల టిక్కెట్ కోరుకోవడం లేదు
తాను నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఆశించడం లేదని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను భూమా కుటుంబానికి ఎప్పటికీ మద్దతుగా ఉంటానని చెప్పారు. కానీ అఖిలప్రియ తనను పట్టించుకోవడం లేదని, కాబట్టి నంద్యాల ఉప ఎన్నికల వరకు వారికి అండగా ఉంటానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ మెట్టు దిగారు.