మంత్రిగా తొలిసారి కర్నూలులో, నంద్యాల ఉపఎన్నికపై అఖిలప్రియ మాట ఇదే!
నంద్యాల ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలనే దానిపై కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని అఖిలప్రియ తెలిపారు.
కర్నూలు: పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అఖిలప్రియ కర్నూలు నగరానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి అఖిలప్రియకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నుంచి స్టేట్ గెస్ట్హౌస్ వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి అఖిలప్రియ పూలమాలలు వేశారు. ఆపై టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఓ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు.
జిల్లా అభివృద్ధి కోసం నేతలందరితో కలిసి పనిచేస్తానని అఖిలప్రియ అన్నారు. ఇక నంద్యాల ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించాలనే దానిపై కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా, భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగ మౌనిక రెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి పేర్లు నంద్యాల టికెట్ కోసం ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా భూమ కుటుంబానికి ప్రత్యర్థి అయిన శిల్పా మోహన్ రెడ్డి సైతం నంద్యాల ఉపఎన్నిక టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భూమా కుటుంబానికే టికెట్ దక్కుతుందా? లేక శిల్పామోహన్ రెడ్డి చక్రం తిప్పుతారా? అన్నది వేచి చూడాలి.