కులాల మధ్య చిచ్చుపెడుతున్న బాబు, టార్గెట్ చేశారన్న అఖిలప్రియ
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆరోపించారు. భూమా నాగిరెడ్డి పైన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చంద్రబాబు వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు.
భూమా పైన పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఇలాంటివి మొదటి నుండి అలవాటే అన్నారు.
తండ్రిని కలిసిన అఖిల ప్రియ
పిఎసి చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు. భూమా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల అనుమతితో అఖిల ప్రియ తండ్రిని కలిశారు. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతిలోని స్విమ్స్ లేదా హైదరాబాదులోని నిమ్స్కు తరలించే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటారు.
టార్గెట్ చేసి ఇరికించారు: అఖిల ప్రియ
మా నాన్న భూమా నాగిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన పైన అన్యాయంగా కేసులు పెట్టారని అఖిల ప్రియ అన్నారు. బెయిల్ పిటిషన్ వేశామని, రేపు విచారణకు వస్తుందని చెప్పారు. ఈ వ్యవహారంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు.