భూమా కన్నుమూత, రేపు అంత్యక్రియలు: కుటుంబ సభ్యుడ్ని కోల్పోయాం: బాబు-జగన్ షాక్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం నాడు కన్నుమూశారు.
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత భూమా నాగిరెడ్డి(53) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నంద్యాలలోని సురక్ష ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయం తెలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
In deep anguish & shock over the demise of TDP family member Bhuma Nagi Reddy garu. My deepest condolences. We will stand by his family.
— N Chandrababu Naidu (@ncbn) March 12, 2017
భూమా నాగిరెడ్డి మృతిపై వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాను షాక్కు గురైనట్లు చెప్పారు. ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయామని జగన్ వ్యాఖ్యానించారు.
రేపు అంత్యక్రియలు
భూమా నాగిరెడ్డికి రేపు (సోమవారం) ఆళ్లగడ్డలో అంత్యక్రియలు జరగనున్నాయి. భూమా మృతి చెందిన విషయం తెలియగానే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అంతకుముందు.. భూమాకు ఆదివారం నాడు ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆళ్లగడ్డ నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
భూమాకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తొలుత ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 నంద్యాలలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
టిడిపి తరఫున ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు. ఇదే సమయంలో ఆయన మృతి చెందడంతో పార్టీ శ్రేణులు ఢీలాపడ్డాయి. భూమాకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది.
కేసీఆర్ సంతాపం
భూమా నాగిరెడ్డి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంచి నాయకుడిని కోల్పోయామని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి అన్నారు.
ఆసుపత్రికి తనయుడు
భూమా మృతి చెందిన విషయం తెలిసి టిడిపి యువనేత నారా లోకేష్ నంద్యాల బయలుదేరారు. భూమా కొడుకు ఆసుపత్రికి వచ్చారు. అహోబిళంలో ఉన్న భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ హుటాహుటిన బయలుదేరారు.
టిడిపి కార్యాలయానికి భూమా మృతదేహం
మధ్యాహ్నం నంద్యాల టిడిపి కార్యాలయానికి భూమా మృతదేహాన్ని తీసుకు వచ్చారు. నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. భూమా మృతితో ఆళ్లగడ్డలో అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భూమా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మరోవైపు, తండ్రి మృతదేహాన్ని చూసి అఖిలప్రియ కన్నీరుమున్నీరు అయ్యారు.