ఆళ్లగడ్డ సబ్ జైల్లోనే భూమా నాగిరెడ్డి: ఆహారం ముట్టకుండా మొరాయింపు
కర్నూలు: తనను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ సబ్జైల్లో దీక్షకు దిగారు. తన ఆరోగ్యం బాగోలేదని, నిమ్స్కు తరలించాలని వైద్యులు సూచించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.
ఆహారం తీసుకోబోనని ఆయన మొండికేస్తున్నారు. ఆయనను హైదరాబాద్ నిమ్స్కు తరలిస్తున్నట్లు అంతకు ముందు వార్తలు వచ్చాయి. అయితే, అందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో భూమా దీక్షకు దిగారు. కర్నూలులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ దేవాదానంను దూషించిన ఘటనలో నాగిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి, జడ్జి ఆదేశాలతో ఆళ్లగడ్డ సబ్జైలుకు తరలించారు. అయితే తన ఆరోగ్యం బాగో లేదని భూమా చెప్పగా పోలీసులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భూమాకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, ఛాతి నొప్పి ఉందని మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు.
కర్నూలు, కడప ఆస్పత్రులు ఉండగా నిమ్స్కు తరలించడం సరి కాదని కలెక్టర్కు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యుల నివేదికపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోసారి భూమా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ సబ్జైళ్లో దీక్షకు దిగారు.