రంగంలోకి వైఎస్ విజయమ్మ, సీన్ రివర్స్: జగన్ పార్టీలోనే భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భూమా నాగిరెడ్డి ఓ ప్రముఖ మీడియా సంస్థతో శనివారంనాడు చెప్పారు.
పీఏసీ చైర్మన్గా ఉన్న మీరే పార్టీ మారితే రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం పార్టీపై పడుతుందని వైయస్ జగన్ భూమాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి కూడా నాగిరెడ్డి, అఖిలప్రియలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేతల బుజ్జగింపులతో భూమా పార్టీ మారే యోచనను ప్రస్తుతానికి వాయిదా వేశారు.
త్వరలో కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో పాటు ఇతర జిల్లాల్లోని అసంతృప్తి వైసీపీ ఎమ్మెల్యేతో జగన్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు భూమాతో మూడు గంటల పాటు చర్చలు జరిపిన ఆపార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి భూమా పార్టీ మారబోరని తెలిపారు. ఈ ఊహాగానాలన్నీ టీడీపీ మైండ్గేమ్లో భాగమే ఆయన అన్నారు.
స్లమ్ లో రియాల్టీ షో ; ఈ రోజు కార్టూన్
అంతకు ముందు ఇలా...
ఆలస్యమైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అంతకు ముందు ప్రచారం జరగింది. ఆయన పార్టీ మారినప్పుడు ఆయన కూతురైన ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు అఖిలప్రియ కచ్చితంగా మారుతారని వార్తలు వచ్చాయి.
వారితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి (కర్నూలు), మణి గాంధీ (కొడమూరు), జయరాములు (ఆలూరు), గౌరు చరితా రెడ్డి (పాణ్యం), బాలనాగిరెడ్డి (మంత్రాలయం) తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వీరిలో ఎస్వీ మోహన్ రెడ్డి శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లోటస్ పాండులో ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల సమావేశానికి హాజరయ్యారు.
నంద్యాల మీడియా సమావేశం వాయిదా...
నిజానికి, భూమా నాగిరెడ్డి శనివారం నంద్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను పార్టీ మారుతున్న విషయాన్ని ప్రకటించాల్సి ఉండింది. అయితే, పార్టీ మారకూడదని ఆయనపై జగన్ తీవ్రమైన ఒత్తిడి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఆయన శనివారంనాడు జగన్తో సమావేశమయ్యారు.
తాను పార్టీ మారుతున్న విషయాన్ని ఆయన జగన్తో స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కీలక నేతల భేటీ, జగన్ తిరిగి ఫోన్లో మాట్లాడడం. వైయస్ విజయమ్మ మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాదుకు బయలుదేరే ముందు భూమా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఆ తర్వాత మాట్లాడుతానని ఆయన చెప్పారు. పార్టీ మారుతారనే వార్తలపై మీడియా ప్రతిననిధులు అడిగినప్పుడు మీడియాలో రోజుకో వార్త రాస్తారు, నేను ఏ విధంగా ఖండిస్తాను అని ఆయన అన్నారు.
ప్లాన్ ఇలా, కానీ...
కాగా, భూమా నాగిరెడ్డి తన అనుచరులతో సమావేశమైనప్పుడు వారి నుంచి పలు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరినట్లుగా విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరాలని భూమా నాగిరెడ్డికి అనుచరులు సూచించినట్లు సమాచారం.
కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు రెండు విడతలుగా టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒక విడత భూమా నాగిరెడ్డి బ్యాచ్ చేరితే, రెండో విడత కొంత సమయం తీసుకుని మరో బ్యాచ్ చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి, తమకు తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా చంద్రబాబు నుంచి హామీ పొందిన తర్వాతనే టిడిపిలో చేరాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి నాయకుల వ్యతిరేకత కారణంగా, ఇతరేతర కారణాల వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కొంత మంది వెనక్కి తగ్గి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలో చేరడానికి ప్రధాన కారణం ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డిఎఫ్) అంటున్నారు. ఈ పథకం కింద శాసనసభా నియోజకవర్గాలకు 2 కోట్ల రూపాయలేసి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు అ నిధులు విడుదల కాలేదు.