కూతురుతో వాగ్వాదం, పోలీసులపై ఆగ్రహం: భూమా అరెస్ట్, ఉద్రిక్తం
కర్నూలు:వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని 3 టౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. డీఎస్పీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే పోలీసులు అతనిని స్టేషన్కు తరలించారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
అంతకుముందు...
ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులను దూషించడంతో కేసు నమోదయింది.
తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు చేశారు. తనను తాకవద్దంటూ భూమా అహంకారం ప్రదర్శించారంటూ డీఎస్పీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన భూమా నాగి రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, భూమా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు వందమంది పోలీసులు మోహరించారు. దీంతో, స్థానికంగా ఉద్రిక్త ఏర్పడింది.
అంతకుముందు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వచ్చారు. ఈ సమయంలో పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదానికి దిగారు. అప్పుడు భూమా నాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తన కూతురును వెళ్లమని చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల పుస్తకం చూపించాలని అడిగారు. నా కూతురును వెళ్లమంటారా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులు... తాము వెళ్లమని చెప్పలేదని, టెంటు కింద కూర్చోమని చెప్పామని తెలిపారు.