ఉద్రిక్తత: డిఎస్పీ ముందు భూమా నాగిరెడ్డి హాజరు
ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అంతకు ముందు చెప్పారు. చట్టాన్ని గౌరవించి తాను పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం. కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాప్రయత్నం కేసు పెట్టారు.
ఆ కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు శుక్రవారం అర్థరాత్రి నుంచి భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఆయన లొంగిపోతున్నట్లు చెప్పడంతో నంద్యాలకు భారీగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ తదితరులు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు.
భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేయడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే, నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు, తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్కు పిలుపునిచ్చింది. శుక్రవారంనాటి మునిసిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. కాగా, సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో భారీగా పోలీసులు మోహరించారు.