అదో ఈజిప్ట్ మమ్మీ: కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిన భూమన
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి రఘువీరారెడ్డి తన అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ, ఈజిప్టు మమ్మీ రెండు ఒకటేనని వ్యాఖ్యానించారు. వైయస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కుక్కలు చించిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత మహానేత వైయస్సార్దేనని భూమన అన్నారు.
రఘువీరా లేఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఓ లెటర్ హెడ్ ఉందని, అధ్యక్షుడు రఘువీరా అని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్పై సోనియా గాంధీ ప్రతీకారం ప్రజలెన్నటికీ మర్చిపోరని అన్నారు. చంద్రబాబుతో కుమ్మ్కకై జగన్ను అన్యాయంగా జైలుకు పంపిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు.
మీరా కుమార్ స్పీకర్గా ఉన్న సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది మీరు కాదా?త అని భూమన సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ఆమెకు ఎందుకు మద్దతిస్తామని నిలదీశారు. తమకు సలహాలు ఇచ్చే స్థాయి కాంగ్రెస్కు లేదన్నారు.
నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేయడం సంప్రదాయం కాదంటూ చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారని, నంద్యాల సీటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పారు. టీడీపీ అక్కడి నుంచి పోటీ చేయకుండా సంప్రదాయాన్ని పాటించి తమ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించాలని చంద్రబాబుకు భూమన హితవు పలికారు.