బాబుకు వెన్నులో వణుకు పుడుతోంది: శునకాలంటూ భూమన తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెన్నులో వణుకుపుడుతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెన్నులో వణుకుపుడుతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ శునకాలన్నీ మొరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మీడియాతో భూమన మాట్లాడారు. పందుల గుంపులా టీడీపీ నేతలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 9హామీలు ప్రజల గుండెను తాకాయని చెప్పారు. దీంతో చంద్రబాబు గుండె అదురుతోందని అన్నారు.
జగన్ను చూస్తేనే చంద్రబాబు బెదిరిపోతున్నారని అన్నారు. దివంగత సీఎం వైయస్సార్ రైతులను ఆదుకుంటే.. చంద్రబాబు చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ ఆశయాలే తమకు ఆదర్శమన్నారు. 600హామీల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు మాట తప్పినందువల్లే ప్రజావ్యతిరేకత ఎదురవుతోందని అన్నారు. చంద్రబాబుకు తనదని చెప్పుకునే ఏదైనా ఒక పథకం ఉందా? అని భూమన ప్రశ్నించారు. చంద్రబాబులా ఓట్ల కోసం ప్రకటనలు చేసే వ్యక్తి జగన్ కాదని, 600 హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని భూమని జోస్యం చెప్పారు. వైయస్ పథకాలకు మళ్లీ జీవం పోస్తామని తెలిపారు.