'బయటపడేందుకే.. కేసీఆర్ కు చంద్రబాబు 500కోట్లు'
తిరుపతి : తిరుపతి పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని విజయవాడ బాట పట్టిన చంద్రబాబు వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీసీ నేతలు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి.. చంద్రబాబును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
ఓటుకు నోటు కేసు విషయాన్ని ప్రస్తావించిన భూమన.. ఉన్న పలంగా చంద్రబాబు విజయవాడ పారిపోవడం వెనుక పెద్ద కథే ఉందన్నారు. కేసు నుంచి బయటపడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టేశారని ఆరోపించారు.
ఇక కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ఓటుకు నోటులో చంద్రబాబు అడ్డంగా బుక్కయినప్పుడు బ్రహ్మదేవుడు కాపాడలేరని హెచ్చరించిన కేసీఆర్, కేసు నమోదై 14 నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ అనుబంధ చార్జీషీట్ ఎందుకు వేయకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం స్థాయి వ్యక్తే లంచాలు ఇస్తూ దొరికిపోయాక కూడా కేసును నీరు గార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు భూమన.
చంద్రబాబు లాంటి పనికిమాలిన సీఎం దేశం మొత్తంలో ఎక్కడా లేరని మండిపడ్డారు భూమన. మోసం,కపటం తప్ప నైతిక విలువల్లేని చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండడం తెలుగుజాతికే అవమనాకరమన్నారు. తనకు తాను ఎప్పుడూ నిప్పును అని ప్రకటించుకునే చంద్రబాబు.. నిజంగా నిప్పే అచయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.