"బాబు ఆస్తుల ప్రకటన ఓ బిగ్ జోక్.. కానిస్టేబుల్తో ఎంక్వైరీ చేసినా నిజం తేలుద్ది"
హైదరాబాద్ : బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తులు ప్రకటించిన నేపథ్యంలో.. కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి. ట్రాఫిక్ పోలీస్ తో విచారణ చేయించిన చంద్రబాబు ఆస్తుల్లో నిజమెంతన్నది తేలుతుందని ఎద్దేవా చేశారు.
లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం.. కడుపేదరికంలో ఉన్న చంద్రబాబు కుటుంబాన్ని చూసి జాలితో తలా రూ.100 దానం చేసి ఆయన్ను ఆదుకోవాలని సూచించారు. చంద్రబాబు ఆస్తులు పెరిగితే రాష్ట్రంలో పేదరికం పెరిగినట్లేనని, ఆయన ఆస్తులు తగ్గినప్పుడే ప్రజలంతా సంతోషంగా ఉంటారని ఈ సందర్బంగా భూమన పేర్కొన్నారు. గురువారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన భూమన ఈ విమర్శనాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు కుటుంబం ప్రకటిస్తోన్న ఆస్తులతో రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనమేది లేదని, అదంతా ఓ బోగస్ అని కొట్టిపారేశారు భూమన. లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలను తప్పుబడుతూ.. 13ఏళ్ల క్రితమే 'దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు' అన్న సంగతి తెహల్కా బయటపెట్టిందన్నారు. చంద్రబాబు కుటుంబం చేస్తోన్న ఆస్తుల ప్రకటన బిగ్ జోక్ అని, దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. బాబు ఆస్తుల ప్రకటన చూస్తే.. అంబానీ అదానీలు సైతం పేదవాళ్లమని చెప్పుకున్నట్లుగా ఉందన్నారు.