బస్సు కిందికి బైక్ దూసుకెళ్లి మిత్రుడితో సహా యువతి మృతి
కడప: విపరీతమైన వేగంతో నిర్లక్ష్యంగా బైక్ నడపడంతో ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బైక్ వేగంగా వెళుతూ శేషయ్యగారిపల్లె వద్ద హైవేపై ఆగి వున్న బస్సును ఢీకొట్టింది. దాంతో ఆగకుండా బైక్ పూర్తిగా బస్సు కిందికి దూసుకెళ్లింది.
శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. కడప జిల్లా ఖాజీపేట మండలం రావులపల్లెకు చెందిన పత్తూరు పుల్లయ్య (26), ప్రొద్దుటూరు పట్టణం హోమ్సపేటకు చెందిన శ్రీలత (25) అనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. కడప నగరం ఆర్కేపీజీ కళాశాలలో ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న శ్రీలత ఉదయం ప్రొద్దుటూరు నుంచి కళాశాలకు బయలుదేరింది.
మైదుకూరులో బస్సు దిగి అక్కడి నుంచి కడపకు వచ్చే బస్సులో ఎక్కి చెన్నూరులో దిగింది. అప్పటికే పుల్లయ్య ద్విచక్ర వాహనంతో శ్రీలత కోసం ఎదురుచూస్తున్నాడు. బస్సు దిగిన విద్యార్థినీని బైకులో ఎక్కించుకొని కడపకు బయలుదేరాడు. శేషయ్యగారిపల్లె వద్ద గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మైదుకూరు డిపోకు చెందిన బస్సునుంచి దిగుతున్నారు.
ఆ సమయంలో పుల్లయ్య వేగంగా వచ్చి ఆగిన ఆ బస్సును ఢీకొన్నాడు. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో పుల్లయ్య, శ్రీలత తీవ్రంగా గాయపడ్డారు. హైవేలోని టోల్ప్లాజా సిబ్బంది అంబులెన్సలో రిమ్స్కు తరలించారు. అయితే పుల్లయ్య మృతి చెందగా శ్రీలత తీవ్రంగా గాయపడింది.
ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలి స్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కళాశాలకు వెళ్లే సమయం కావడంతో విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు.