మీ వల్ల మోడీకి ఇబ్బంది: బీజేపీ నేత ఝలక్, జగన్పై బాబు మైండ్ గేమ్
నెల్లూరు/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీని వైసిపి అధనేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కలవడంపై కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదని బీజేపీ నెల్లూరు జిల్లా నేత సురేంద్ర రెడ్డి అన్నారు.
కొంతమంది చేస్తున్న విమర్శలు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి ఇబ్బందికరంగా ఉన్నాయని టిడిపిని ఉద్దేశించి అన్నారు. క్యాబినెట్ హోదా కలిగిన నాయకుడిగా జగన్ ప్రధానిని అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే తప్పేమిటో చెప్పాలన్నారు.
వాస్తవాలు వక్రీకరించే విధంగా చేయడం సరికాదని సురేంద్ర అన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించిందని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఏపీ పర్యటన విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై గత కొద్ది రోజులుగా టిడిపి, వైసిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కలవడంపై టిడిపి విమర్శలు చేసినా, ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంది.
వెనక్కి తగ్గిన టిడిపి
ప్రధాని నరేంద్ర మోడీ ఓ క్రిమినల్కు అపాయింటుమెంట్ ఇవ్వడం ఏమిటని, పక్కన ఎలా కూర్చుండ బెట్టుకుంటారని టిడిపి ప్రశ్నించింది. అయితే బీజేపీ ఎదురు దాడి చేయడంతో వెనక్కి తగ్గింది. ప్రధానితో భేటీని తాము తప్పుపట్టడం లేదని, కానీ లోపల ఒకటి మాట్లాడి, బయట ఇంకోటి చెప్పడాన్ని తాము ప్రశ్నిస్తున్నామని చెప్పింది. అంతేకాదు, ప్రధాని మోడీ.. జగన్ వంటి క్రిమినల్స్కు సాయం చేయరని తమకు తెలుసునని ప్రశంసించారు కూడా. బీజేపీ ఎదురు దాడి వల్ల టిడిపి... కేవలం జగన్నే టార్గెట్ చేస్తోంది.
ఆ వర్గాలను మోసం చేస్తున్న జగన్
జగన్ తీరు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీని కలవడం, మద్దతిస్తానని చెప్పడం ఆత్మహత్యా సదృశ్యమని మండిపడ్డారు. జగన్ వెంటనే వైయస్ బొమ్మ తొలగించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్ చేశారు. 2014లో క్రిస్టియన్లు, ముస్లీంలు వైసిపి వైపు మొగ్గు చూపారని, ఇప్పుడు జగన్ ప్రకటనతో వారంతా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు.
జగన్పై టిడిపి మైండ్ గేమ్
ప్రధానితో జగన్ భేటీపై టిడిపి తొలుత బీజేపీని, వైసిపిని తప్పుబట్టింది. బీజేపీ ఎదురుదాడితో అది కేవలం జగన్నే టార్గెట్ చేస్తోంది. జగన్ మాటలకు మోడీ చల్లబడరని ప్రశంసిస్తున్నారు. విమర్శలు ఇంకా కొనసాగిస్తున్నారు. హోదాపై తాను తగ్గేది లేదని జగన్ చెప్పారు. కానీ హోదాపై జగన్ వెనుకడుగు వేశారని, అందుకే రాజీనామాల గురించి మాట్లాడటం లేదని, కేసుల గురించే ప్రధానిని కలిశారని చెబుతూ.. జగన్ను టిడిపి మైండ్ గేమ్తో దెబ్బతీయాలని చూస్తోందని కొందరు అంటున్నారు. చంద్రబాబు కూడా జగన్ను ఒక్కడినే టార్గెట్ చేయాలని నేతలకు చెప్పారు.
అదే జగన్కు చిక్కు
జగన్కు ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలోనే చిక్కు వచ్చి పడింది. హోదా గురించి వచ్చే నెలలో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్.. ఇప్పుడు తమ ఎంపీలతో ఎప్పుడు రాజీనామా చేయిస్తారో చెప్పాలని టిడిపి నిలదీస్తోంది. కానీ జగన్ మాత్రం ఇప్పుడు కాకుంటే ఆర్నెళ్ల తర్వాత అంటున్నారు.