లేకుంటే ఏంటి: ఏపీకి హోదాపై బీజేపీ మరో ట్విస్ట్! బాబుకు పురంధేశ్వరి 'పవర్' ఝలక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. హోదా పైన భారతీయ జనతా పార్టీలు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా స్పష్టత ఇవ్వడం లేదు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి, మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు వేర్వేరు సందర్భాల్లో మంగళవారం ప్రత్యేక హోదా పైన స్పందించారు.
ప్రత్యేక హోదా పైన వెనక్కి తగ్గే సమస్యే లేదని, దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పారు. హోదా విషయంలో వెనక్కి వెళ్లమని హరిబాబు చెప్పారు.
అదే సమయంలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ మరో రకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వదని చెప్పకపోయినప్పటికీ.. వారి మాటల్లో అర్థం అదే స్ఫురిస్తోందని అంటున్నారు. అదే సమయంలో ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనే మాట చెబుతున్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని, యూపీఏనే ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమీ లేదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
పురంధేశ్వరి కూడా అదేవిధంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉన్నా లేకున్నా ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు.
చంద్రబాబుకు పురంధేశ్వరి ఝలక్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, పురంధేశ్వరికి రాజకీయంగా పడదనే విషయం అందరికీ తెలిసిందే. బీజేపీలో చేరిన ఆమె మిత్రపక్షమైన టీడీపీకి పలుమార్లు ఝలక్ ఇచ్చారు. తాజాగా చంద్రబాబుకు మరో షాకిచ్చారు. ఏపీలో 24 గంటల విద్యుత్ వస్తోందని, అది కేంద్రం సహకారంతోనే అనే విషయం గుర్తించాలని ట్విస్ట్ ఇచ్చారు.