అమిత్ షా తెర వెనుక వ్యూహం: ఇంత జరుగుతోందా? బాబుకు ఎసరేనా!
టీడీపీ పొత్తు విషయంలో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా.. ఆ విషయాన్ని బయటపెడుతూనే ఉన్నారు.
విజయవాడ: అధిష్టానం వైఖరి ఎలా ఉన్నా.. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో మాత్రం టీడీపీతో పొత్తు పట్ల అసంతృప్తి పెల్లుబికుతూనే ఉంది. టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతల్లో ఎవరో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. టీడీపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ బలపడలేదనేది వారి ఆరోపణ.
అటు టీడీపీ నుంచి కేశినేని నాని లాంటి నేతలేమో.. బీజేపీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నామంటున్నారు. మొత్తానికి పొత్తు పట్ల ఇరువర్గాల్లోను అసంతృప్తి గూడుకట్టుకుందనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అయితే రెండు పార్టీల అధిష్టానాలు మాత్రం నేతల అభిప్రాయాల కన్నా.. భవిష్యత్తు ప్రయోజనాల రీత్యా ఈ అంశంపై అంతగా నోరు మెదపడం లేదు.
నేనెందుకు చెప్పాలి: అమిత్ షా
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు విజయవాడ పర్యటనలోను ప్లకార్డుల ద్వారా బీజేపీ నేతలు తమ వైఖరిని స్పష్టం చేశారు. 'లీవ్ టీడీపీ.. సేవ్ బీజేపీ' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే విషయంపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా ను ప్రశ్నించగా.. ఆయన భిన్నంగా స్పందించారు. అది కేవలం కార్యకర్తల అభిప్రాయం మాత్రమే అన్న అమిత్ షా.. దానిపై నేనెందుకు సమాధానం చెప్పాలని ఎదురు ప్రశ్నించడం గమనార్హం.
కావూరి, కన్నా లక్ష్మీనారాయణలు టీడీపీపై:
టీడీపీ పొత్తు విషయంలో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా.. ఆ విషయాన్ని బయటపెడుతూనే ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందని కేశినేని చేసిన వ్యాఖ్యలకు.. ఇది వ్యక్తిగత అభిప్రాయమా? లేక కేశినేని వెనుక బాబు అధిష్టానం ఉందా? అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు.
ఇక మరో బీజేపీ నేత కావూరి సాంబశివరావు.. రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ పడిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి. ఆయనవి మతిలేని వ్యాఖ్యలని టీడీపీ నేతలు కొట్టిపారేసినప్పటికీ.. ఇరు పార్టీల మధ్య అంతర్గత పోరు ఎంతగా రగులుతుందో దీని ద్వారా స్పష్టమవుతోంది.
పురంధేశ్వరి వంతు:
కావురి, కన్నా తర్వాత ఇప్పుడు మరో బీజేపీ నేత పురంధేశ్వరి సైతం టీడీపీని కడిగిపారేసేందుకు సిద్దమయ్యారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందన్న వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆమె సీఎం చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. అంతేకాదు, టీడీపీతో పొత్తు ప్రస్తుతానికి కొనసాగుతుందని, భవిష్యత్తులో పొత్తు ఉండేది లేదని ఇప్పుడే స్పష్టతనివ్వలేమని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఇది అమిత్ షా పనేనా?:
ఆంధ్రప్రదేశ్ టూర్ ముగించుకుని అమిత్ షా వెళ్లిపోయిన తర్వాత పురంధేశ్వరి రూపంలో టీడీపీకి విమర్శలు ఎదురవడం.. ఇది షా వ్యూహమేనా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఓవైపు సామరస్యంగా ఉన్నట్లుగానే తెరపై రాజకీయాన్ని రక్తి కట్టిస్తూ.. అంతర్గతంగా మాత్రం పార్టీ శ్రేణులతో వ్యతిరేక గళాన్ని వినిపించేందుకు ఆయన వ్యూహాలు పన్నారన్న వాదన వినిపిస్తోందిజ. అందుకు అనుగుణంగానే రానున్న రోజుల్లో టీడీపీపై బీజేపీ స్వరం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో టీడీపీ-బీజేపీ కయ్యానికి బీజం పడ్డట్లే అనేవారు లేకపోలేదు.