మోడీతో భేటీలో జగన్ ప్రతిపాదన: దానికే బిజెపి సై, అమిత్ షా వ్యాఖ్య అదే..?
జగన్ ప్రతిపాదనతో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
విజయవాడ: బిజెపి జాతీయాధ్యక్షుడు తన తెలంగాణ పర్యటనలో సోమవారం వ్యాఖ్యలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రాజకీయాల్లో అవి పలు వ్యాఖ్యలకు దారి తీస్తున్నాయి. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటనలో చెప్పారు.
తెలంగాణలో ఆ ప్రకటన చేసినప్పటికీ ఎక్కువగా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అన్వయిస్తున్నారు. దానికితోడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దూరం జరగడానికి సిద్ధమైనట్లు అంచనాలు వేస్తున్నారు.
అమిత్ షా వ్యాఖ్యల సంకేతాలను మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలు కూడా ఆ దిశగానే రాజకీయాలు సాగే అవకాశాలున్నాయనే అర్థాన్ని ఇస్తున్నాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ వద్ద చేసిన ప్రతిపాదన మేరకు వెళ్లడానికి బిజెపి సిద్ధపడిందా అనుమానాలు కలుగుతున్నాయి.
జగన్ చేసిన ప్రతిపాదన ఏమిటి...
జగన్ ఇటీవల ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. కలిసిపోదామని మోడీ చేసిన ప్రతిపాదనకు ఈ భేటీలో వైయస్ జగన్ తనదైన ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. రెండు పార్టీల ఓటు బ్యాంకు వేర్వేరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేద్దామని, అవసరమైతే ఎన్నికల తర్వాత కలుద్దామని జగన్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.
అమిత్ షా వ్యాఖ్యలు...
జగన్ ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మలుపులు చోటు చేసుకోనున్నాయనే సంకేతాలు అందాయి. బిజెపి చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే, బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఇరు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని అమిత్ షా చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
చంద్రబాబులో కలవరం....
జగన్తో మోడీ భేటీతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ భేటీని తప్పు పడుతూ వచ్చారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. దీంతో బిజెపి నాయకులు ఎదురుదాడికి దిగారు. బిజెపితో టిడిపి పొత్తుపై ప్రమాద సంకేతాలను ఇచ్చింది. దాంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. మోడీపై వ్యాఖ్యలు చేయవద్దంటూ టిడిపి నాయకులను హెచ్చరించారు.
ఒంటరిగా పాగాకు...
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయాలని బిజెపి వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు నుంచి తమ పార్టీలోకి వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నేతలను బరిలోకి దింపడం ద్వారా సత్తా చాటే ఉద్దేశం బిజెపికి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇటీవల పురంధేశ్వరి బిజెపిలో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.