మోడీకి చంద్రబాబు ఝలక్: ఆ కొలికి, కేవీపీ బిల్లుపై బీజేపీ వ్యూహం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ఈ సమావేశాల్లో ఓటింగుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు, బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు.
ప్రత్యేక హోదా పైన తాను ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగాలని కేవీపీ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. గత శుక్రవారమే దీనిపై ఓటింగ్ జరుగుతుందని భావించారు.
బీజేపీకి హోదా షాక్: కేవీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
కానీ రాజ్యసభ వాయిదా పడింది. ప్రభుత్వం వ్యూహాత్మక వైఖరితో సభను వాయిదా వేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే శుక్రవారం కాకుండా, ఆ తర్వాత వచ్చే శుక్రవారం దీనిపై చర్చ చేపడతామని డిప్యూటీ చైర్మన్ కురియన్ సోమవారం చెప్పారు. ఈ శుక్రవారమే కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.
కానీ, ఈ బిల్లు పైన బీజేపీ వ్యూహాత్మక పావులు కదుపుతోందని తెలుస్తోంది. ఈ బిల్లు ఓటింగుకు నోచుకోకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహం రచిస్తోందని తెలుస్తోంది. ఇందుకు ఆర్థిక సాకులు చూపనుందని అంటున్నారు.
ఆర్థిక అంశాలతో కూడిన ఏ బిల్లు అయినా లోకసభ ద్వారానే రావాలని కేంద్రం కొత్త కొలికి పెట్టనుందని తెలుస్తోంది. ఇది ఆర్థిక అంశాలతో కూడిన బిల్లు కాబట్టి రాజ్యసభలో ఓటింగు లేకుండా తిరస్కరించే వ్యూహం పన్నుతోందని అంటున్నారు. కేవీపీ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు టిడిపి కూడా మద్దతు పలికిన విషయం తెలిసిందే. టిడిపి కూడా మద్దతు పలకడంతో బీజేపీ మరింత ఇరుకున పడినట్లయిందని అంటున్నారు.