అమరావతిపై ఇంత హంగామా ఎందుకు?: బాబుపై సోము వీర్రాజు ఫైర్
దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలన్ని ఇలాగే హంగామా చేశాయా? అని ప్రభుత్వ తీరును సోము వీర్రాజు దుయ్యబట్టారు.
అమరావతి: శనివారం మధ్యాహ్నాం అసెంబ్లీ కమిటీ హాల్లో పోస్టర్ డిజైన్ ప్రదర్శన ద్వారా అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు శాసనసభ్యులకు వివరించారు. దీనిపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆ రాష్ట్రాలన్ని ఇలాగే హంగామా చేశాయా? అని ప్రభుత్వ తీరును సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఇప్పుడున్నవి అసెంబ్లీ, సచివాలయాలు కాదా? మళ్లీ కొత్తవి నిర్మించడం అవసరమా? అని ప్రశ్నించారు.
ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయపూర్ ను ఆ రాష్ట్ర హౌజింగ్ బోర్డే నిర్మించిందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సింగపూర్, జపాన్ అంటూ హంగామా చేస్తున్నాయని విమర్శించారు.
అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వీర్రాజు ప్రస్తావించారు. టీడీపీ వల్లే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ గెలుచుకుంటే.. మరి మిగతా చోట్ల టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. తాము మోడీ ఫోటోతో ఎన్నికలకు వెళ్తే.. టీడీపీ చంద్రబాబు ఫోటోతో వెళ్లిందని గుర్తు చేశారు.
అధికార పార్టీకి బీజేపీ ఇప్పుడు కొత్తిమీర కట్టలా కనిపిస్తోందని మండిపడ్డారు. పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమను కనీసం సంప్రదించకుండా వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.