నంద్యాల ఉప ఎన్నిక: చంద్రబాబుకు బిజెపి ఊరట, జగన్కు షాక్
తెలుగుదేశం పార్టీకి దూరమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బిజెపి కీలకమైన నిర్ణయం తీసుకుంది.
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి దూరమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక విషయంలో బిజెపి కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాస్తా ఆలస్యంంగానే అయినప్పటికీ ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరటనిచ్చేదే.
కాగా, బిజెపి నిర్ణయం నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు షాక్ ఇచ్చేదే. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి మద్దతు తెలియజేయాలని ఎపి బిజెపి నిర్ణయం తీసుకుంది.
విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి అధికారికంగా ప్రకటించింది. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపితో కలిసి పనిచేయాలని బిజెపి నిర్ణయం తీసుకుంది.
ఆదివారం లేదా సోమవారం నుంచి నంద్యాలలో బిజెపి కార్యకర్తలు కూడా టిడిపితో కలిసి ప్రచారంలో పాల్గొంటారని బిజెపి నేతలు చెప్పారు. నంద్యాలలో ఆగస్టు 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది.బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.