ప్రధానిపై హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు: 'రాజద్రోహం, సీపీకి ఫిర్యాదు చేస్తాం'
అమరావతి: దేశం నుంచి ఆంధ్రప్రదేశ్ను విడదీయాలంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులిస్తున్నామని, అలాంటప్పుడు ప్రత్యేక హోదా అవసరం ఏముందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హీరో శివాజీ ఓ ఛానల్తో మాట్లాడుతూ 'ఇవాళ, సన్నాసి మంత్రెవడో ఒకడు చెప్పాడని చెప్పి, ఆయనకు తెలియదేమో.. 14వ ఆర్థిక సంఘం.. బీజేపీ సన్నాసుల్లారా ఒకసారి వినండి.. 14వ ఆర్థిక సంఘం బీహార్కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీపైనా శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 'మన ప్రధాని గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ఆర్టీఫీషియల్ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధాన మంత్రి కాదు' అని వ్యాఖ్యానించారు. 'ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి కక్ష, ముఖ్యంగా చంద్రబాబు నాయుడంటే మోడీకి కసి' అని అన్నారు.
ఎవరైతే బీజేపీ వైపు వెళతారో వారికి ఉన్న విలువ కూడా పోతుందన్నారు. ఏపీ ప్రజలకు మోడీపై నమ్మకమే లేదని తెలిపారు. ఇప్పటికైనా మోడీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని, బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చి, కేంద్రంపై ఎదురుదాడి చెయ్యాలన్నారు.
ఏపీకి ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతోందని శివాజీ అన్నారు. దీంతో హీరో శివాజీ వ్యాఖ్యలను బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. హీరో శివాజీ వ్యాఖ్యలు రాజద్రోహం చేసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడిపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.