నల్లడబ్బు, విదేశీ సొమ్ము వేరు: వైసీపీ ఎంపీ, పొర్న్సైట్లపై..
న్యూఢిల్లీ: విదేశాల్లో డిపాజిట్ చేసిన డబ్బుకు, నల్లధనంకు ఉన్న తేడాని గుర్తించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం అన్నారు. నల్ల ధనం పైన లోకసభలో గురువారం చర్చ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావడానికి ప్రభుత్వం, వివిధ దేశాలతో సంప్రదింపులు జరపాలన్నారు. 1998 - 2008 సంవత్సరాల మధ్య గల పదేళ్ల కాలంలో దాదాపు రూ.30 లక్షల కోట్ల ధనం ఇతర దేశాలకు వెళ్లిందన్నారు. పన్నుల వ్యవస్థ సరళంగా ఉన్న సైప్రస్, స్విట్జర్లాండు దేశాలకు ఈ ధనం వెళ్లిందన్నారు.
మనం మన విధానాలను సరళీకరించకుంటే, ఆ ధనం ఇక్కడక ఉండేలా చూసుకోవచ్చునని తెలిపారు. అది మన దేశ సమగ్రాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాగా, బుధవారం నాడు ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్లో పోర్న్ విస్తరించడం పైన దృష్టి సారించాలని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రంపై టీఎంసీ మండిపాటు
అదానీ గ్రూపుకు కేంద్ర ప్రభుత్వ సాయంపై తృణమూల్ కాంగ్రెస్ గురువారం రాజ్యసభలో జీరో అవర్లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. వారికి ఇష్టమైన వ్యక్తులకు ప్రాజెక్టులు కట్టబెట్టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారీ రుణం ఇప్పించారని విమర్శించింది. ఆస్ట్రేలియాలోని ఓ మైనింగ్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపుకు ఎస్ బీఐ రూ.6,000 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తెలిపారు. భారతదేశంలో ఏ బ్యాంకు ఇంత పెద్ద మొత్తంలో రుణం ఇవ్వలేదన్నారు.
కానీ, వారు రూ.200 కోట్లకు మాత్రమే అవగాహన పత్రంపై సంతకాలు చేశారన్నారు. పలు ప్రపంచస్థాయి బ్యాంకులు ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించాయన్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్, ప్రధాని మోడీతో అమెరికా పర్యటనలో తిరిగారని, బ్రిస్బేన్ సమావేశాల్లోనూ పీఎం పక్కనే ఉన్నారన్నారు. అలా తన అనుయాయులకు కేంద్రం రుణం ఇప్పించిందని ఆరోపించారు. దీనిని వెంకయ్య నాయుడు ఖండించారు. ఇరవై మంది వ్యాపారవేత్తల సభ్యుల బృందంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ ఉన్నారన్నారు.