టిడిపికి, పదవికి సత్యవతి రాథోడ్ రాజీనామా: తెరాసలోకి
2009 ఎన్నికల్లో సత్యవతి రాథోడ్ వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆమె తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లనున్నారు. తన అనుచరులతో ఈ విషయమై ఆమె సమావేశాలు నిర్వహించారు. ఆమె రాకను తెరాస స్థానిక నేతలు ఆహ్వానిస్తున్నారు. మరోవైపు కొందరు టిడిపి నేతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆమె ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు కెసిఆర్ కూడా అంగీకరించడమే కాకుండా టిక్కెట్ పైన హామీ కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో ఆమె తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తి నచ్చినందువల్లే
ఆదివారం సత్యవతి రాథోడ్ తన నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ... కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తి నచ్చినందువల్లే, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తాను తెరాసలో చేరుతున్నానని ఆమె చెప్పారు. తాను రేపు తెరాసలో చేరనున్నట్లు చెప్పారు.
మరోవైపు బోథ్ ఎమ్మెల్యే నగేష్ కూడా కారెక్కనున్నారు. తాను పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం చేరుతున్నానని నగేష్ చెప్పారు. కాగా, సత్యవతి రాథోడ్, నగేష్లు మూడో తారీఖున కెసిఆర్ సమక్షంలో కారెక్కనున్నారు.