టిడిపి ఆటలు సాగనివ్వం, అఖిలప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారు: బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే భూమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని బొత్స తప్పుబట్టారు. కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూమా నాగిరెడ్డిని పోలీసు అధికారి ఉద్దేశపూర్వంగానే నెట్టారన్నారు. నెట్టవద్దన్నందుకు భూమాపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం ఆటలు సాగనివ్వమని బొత్స హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదని భూమాను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించలేదని.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు.
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఎమ్మెల్యే అఖిల ప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నిస్తే.. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నట్లా? అని బొత్స నిలదీశారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై చంద్రబాబు కుట్రలు: శైలజా
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్ ఆరోపించారు. శనివారం ఇందిరాభవన్లో మాట్లాడుతూ.. ఉన్నత విద్యాలయాల్లో యాజమాన్యం కోటా సీట్లను 50 శాతానికి పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రీ మెడికల్ కాలేజీల్లో 1500 సీట్లు మేనేజ్ మెంట్లకు కట్టబెట్టడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలోతొక్కిన చంద్రబాబు సర్కార్ రైతాంగాన్ని మోసం చేస్తోందని శైలజానాథ్ ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.