మాటల గారడీయే, సెక్షన్ 8పై చిత్తుశుద్ధి లేదు: బాబు బొత్స
హైదరాబాద్: సెక్షన్-8పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా సెక్షన్-8 అంశాన్ని రాష్ట్రపతి వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు హడావిడి చేస్తున్నారు తప్పితే చేతలు లేవని బొత్స ధ్వజమెత్తారు. విభజన చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలులో ఉందని ఆయన చెప్పారు. సెక్షన్ 8 అమలు బాధ్యత గవర్నర్దేనని ఆయన అన్నారు.
సెక్షన్ 8 అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చందర్బాబు చర్చించారా అని ఆయన అడిగారు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడినట్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుబాటులో ఉన్నందున ఆయనతో చంద్రబాబు చర్చలు జరపాలని బొత్స సూచించారు.
మాటల గారడీతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు.