చంద్రబాబు నువ్వు నిప్పువా?: ఓటుకు నోటు కేసు ప్రస్తావన తెచ్చి దులిపేసిన బొత్స
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన 'చంద్రబాబు తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్నారని, నిజంగా చంద్రబాబు నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కోట్లు ఇచ్చి కొన్నట్లు' అని ఆయన ప్రశ్నించారు.
ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనేంత డబ్బు ఎక్కడిదని అన్నారు. హోదా విషయంలో చంద్రబాబు డొల్లతనం, నైజం ఏంటో అందరికి తెలుసని అన్నారు. రాష్ట్రం పరువు మర్యాదలను కాపాడాలంటే చంద్రబాబు వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.
ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పిన బొత్స చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు తాకట్టు పెట్టారని బొత్స ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తాట తీస్తానన్న తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలని అన్నారు. ఓటుకు నోటు కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయని అన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలో కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. హైదరాబాద్పై హక్కులను చంద్రబాబు వదులుకున్నారని అన్నారు. దీంత పాటు రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేకహోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
కాగా, ఆదివారం ఆయన చిత్తూరు జిల్లాలోని వి.కోటలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ేఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించారు. తాను కేసులకు భయపడుతున్నానని ఎవరో చెప్పుకొంటున్నట్లు పవన్ కల్యాణ్ అన్నారని, నిప్పులా బతికానని చెప్పిన సంగతి తెలిసిందే.
భయమంటే ఏంటో తెలియదు, ఆయనే నవ్వులపాలయ్యారు: చంద్రబాబు
తాను ఏ తప్పూ చేయలేదని, వైఎస్ రాజశేఖరరెడ్డి నాపై 23 కేసులు పెట్టారని అందులో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని అన్నారు. చివరకు ఆయనే నవ్వులపాలయ్యారని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తప్పు చేయనని అన్నారు. తాను ఎవరికైనా భయపడతానంటే అది ప్రజలకు మాత్రమేనని అన్నారు. తనకు ఎవరూ హై కమాండ్ లేరుని, ప్రజలే నా హై కమాండ్ అని అన్నారు.