చంద్రబాబు గూబ గుయ్యమంది: 'జగన్తో చర్చకు సిద్ధమా?'
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా కృషి చేస్తోన్న వైసీపీ, సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరింది. హోదా అంశంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్తో ముఖాముఖి చర్చించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అని వైసీపీకి చెందిన పార్థసారథి ఛాలెంజ్ చేశారు.
ముఖాముఖి చర్చకు చంద్రబాబు వస్తానంటే తాము విజయవాడలోనైనా, కుప్పంలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. జగన్ నిర్వహిస్తున్న యువభేరి కార్యక్రమాలతో చంద్రబాబు గూబ గుయ్యిమందని, విద్యార్ధులంతా చంద్రబాబుని ఛీ కొడుతున్నారని అన్నారు.
ఇక చంద్రబాబుకు, కాంట్రాక్టర్లకు మధ్య బ్రోకర్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తయారయ్యారని పార్థసారథి ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ఏపీకి కేంద్రం హోదా ఇవ్వబోమని, ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి విషయాన్ని పట్టించుకోని సీఎంను యువభేరి కార్యక్రమాలలో విద్యార్థులు గట్టిగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ అతలాకుతలమైంది: బొత్స సత్యనారాయణ
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏపీ అతలాకుతలమైందని వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతమైన గుంటూరులో తమ పార్టీ అధినేత వైయస్ జగన్ సోమ, మంగళవారాల్లో పర్యటిస్తారని అన్నారు.
వరదల్లో చిక్కుకున్న బాధితుల పట్ల సహాయ పునరావాస చర్యలు చేపట్టడంలో ఏపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకునే పనిలో ఉన్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోమలపై దండయాత్ర అంటూ మాట్లాడుతున్నారని, మొదట వరదలతో కష్టాల్లో ఉన్న వారిని పట్టించుకోవాలని ఆయన సూచించారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని బొత్స డిమాండ్ చేశారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు.