దాష్టీకం: టీచర్ దెబ్బలకు విద్యార్థి బలి (ఫోటోలు)
విజయవాడ: దయలేని టీచర్ దాష్టీకానికి ఓ బాలుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శుక్రవారం టీచర్ దెబ్బలకు బాలుడు మృతి చెందిన సంఘటన జరిగింది. హోం వర్క్ చేయలేదని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు చితకబాదడంతో బాలుడు ప్రాణాలొదిలాడు.
కంకిపాడు మండలంలోని గోడవర్రు గ్రామానికి చెందిన ఇంటూరి చింటూ(14) అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల తొమ్మిదో తేదీన ట్యూషన్ మాస్టర్ కొట్టడంతో చింటూ తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో బాధితుడు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. ఆ తర్వాత చికిత్స ఖర్చు భరించే స్థోమత లేక గుంటూరు ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు శుక్రవారం మృతి చెందాడు.
చింటూ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన హోం వర్క్ చేయలేదని ట్యూషన్ టీచర్ అతన్ని విపరీతంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. బాలుడి కుటుంబ సభ్యుల విషాదం చెప్పనలవి కాకుండా ఉంది.