వార్నీ.. గంజాయి కొనలేక.. ఏకంగా మొక్కనే పెంచేశాడు
గంజాయి కొనేందుకు డబ్బులు లేక ఏకంగా ఇంటి వద్ద కుండీలో గంజాయి మొక్కను పెంచేశాడో యువకుడు. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఉండేందుకు ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా మొక్కను తీసుకొచ్చి పెంచుతున్నట్టు.
విజయవాడ: గంజాయి కొనేందుకు డబ్బులు లేక ఏకంగా ఇంటి వద్ద కుండీలో గంజాయి మొక్కను పెంచేశాడో యువకుడు. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఉండేందుకు 'వనం-మనం' కార్యక్రమంలో భాగంగా మొక్కను తీసుకొచ్చి పెంచుతున్నట్టు చెప్పాడు.
వివరాల్లోకి వెళితే.. నున్న ప్రాంతానికి చెందిన ఒంగోలు దినేష్(20) చదువు మానేసి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. చందు, సుభాష్, మహేష్ అనే యువకులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు.
వీరందరూ పాయకాపురం శాంతినగర్కు చెందిన ఓ మహిళ దగ్గర గంజాయి కొనుగోలు చేసి తాగుతుంటారు. వీరికి మరో స్నేహితుడు సతీష్ కూడా ఉన్నాడుకానీ ఇతనికి మాత్రం ఈ అలవాటు లేదు.
ఇటీవల స్నేహితులు గొడవపడి పోలీసుస్టేషన్కు వెళ్లారు. పోలీసుల విచారణ సమయంలో అనుకోకుండా ఈ గంజాయి సేవిస్తున్న విషయం వెలుగు చూసింది. అలాగే, దినేష్ తన ఇంటి దగ్గరే గంజాయి మొక్క పెంచుతున్నాడనే విషయం తెలిసి పోలీసులు సైతం విస్తుపోయారు.
అంతేకాదు, ఇంకా కొంతమంది యువకులు పలు మందుల దుకాణాల్లో మత్తుమాత్రలు కొనుగోలు చేసి వేసుకుంటున్నారని వీళ్లే పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇలాంటి వారు 15 మందికి పైగా ఉంటారని, వీరంతా గంజాయి, మత్తు కల్గించే మాత్రలు వాడుతున్నారని పోలీసులు తెలిపారు.