"చంద్రబాబు లాంటి తండ్రి వీళ్లకు అక్కర్లేదు.."
ఆదివాసీలు ప్రజాస్వామ్యం గురించి నిలదీస్తుంటే.. భద్రతా దళాల ఉక్కు పాదాల కింద వారిని అణిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
విశాఖపట్నం: సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు.. గ్రామాలను దత్తత తీసుకోవడం వరకు బాగానే ఉంది గానీ.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తయినా చూస్తున్నారా? అన్నది అనుమానమే. దత్తత తీసుకోకముందు ఎలా ఉందో.. ఆ తర్వాత కూడా గ్రామం అలానే ఉంటే.. ఇలాంటి చర్యలు కేవలం పత్రిక ప్రకటనల్లో ఆదర్శాలకే పరిమితమవుతాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా పెదలబుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అరకులో నిర్వహించిన గిరిజన గర్జన ర్యాలీలో ఈ విషయాన్ని ప్రస్తావించిన బృందాకారత్.. చంద్రబాబు చిత్తశుద్దిని విమర్శించారు. 'దత్తత తీసుకోవడమంటే పిల్లలుగా చేసుకోవడమని.. ఏ సదుపాయం కల్పించని చంద్రబాబు లాంటి వ్యక్తి తమకు తండ్రిగా ఉండటం అక్కర్లేదని' గిరిజనులు భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.
కనీస సౌకర్యాలేవి?
ఇప్పటికీ గిరిజన గ్రామాల ప్రజలు తాగునీరు, విద్య, వైద్య వంటి కనీస సౌకర్యాల కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని బృందాకారత్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు జీవో నం.97ను జారీ చేసి.. అటవీ భూముల విషయంలో గిరిజన హక్కులను ఆయన ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ జీవోను రద్దు చేసేవరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు.
మోడీ-బాబు ఇద్దరూ ఇద్దరే!:
అటు కేంద్రంలో మోడీ.. ఇటు రాష్ట్రంలో చంద్రబాబు.. ఇద్దరూ గిరిజనులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గిరిజనులకు ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని బృందాకారత్ అన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన భూములు, సహజవనరులు, అటవీ ఉత్పత్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్లకు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలపై గిరిజనులంతా ఐక్యంగా పోరాడాలన్నారు.
గిరిజన అణిచివేత
ఆదివాసీలు ప్రజాస్వామ్యం గురించి నిలదీస్తుంటే.. భద్రతా దళాల ఉక్కు పాదాల కింద వారిని అణిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఏజెన్సీలో చదువుకున్న గిరిజన యువతులు తక్కువ వేతనాలకు ఆశావర్కర్స్, అంగన్ వాడీలుగా పనిచేస్తున్నారన్నారు. వారిని రెగ్యులరైజ్ చేయట్లేదని ఆరోపించారు. గిరిజన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు.
ఆదివాసీ జాతీయ మహాసభలు:
కాగా, ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు విశాఖపట్నంలో ఆదివాసీల జాతీయ మహాసభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన గిరిజన ర్యాలీలో బృందాకారత్ పాల్గొన్నారు. గిరిజన గర్జనకు వచ్చింది సమస్యలు తలచుకుని ఏడవడానికి కాదని, కార్యాచరణ రూపొందించుకోవడానికి అని స్పష్టం చేశారు.