వ్యభిచారం కేసుల్లో విటులనూ శిక్షించాలి: హైకోర్టు
హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళ, వ్యభిచారగృహ నిర్వాహకులు, బ్రోకర్లపై మాత్రమే కేసు నమోదు చేయడం తగదని, విటుడిపైనా కేసు నమోదు చేసే విధంగా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడిదంి. ఈ మేరకు చట్టానికి సవరణ చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు తీర్పు కాపీలను పంపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ ఆదేశించారు. 1956 ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం పరిధిలోనికి వ్యభిచార గృహాలకు వెళ్లే విటులు కూడా శిక్షార్హులేనంటూ చట్టానికి సవరణ తేవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర సాహితీవేత్తలు శ్రీరంగం శ్రీనివాసరావు, గురజాడ అప్పారావు రాసిన రచనలను ఉదహరించారు.
తనను బంజారాహిల్స్ పోలీసులు ఈ చట్టం సెక్షన్ 3 ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఓ పిటిషనర్ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన జడ్జి జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వ్యభిచార గృహాన్ని నిర్వహించడం, వ్యభిచారానికి అనుమతించడం, వ్యభిచారంపై వచ్చిన ఆదాయంతో జీవించడం, విటులను ఆకర్షించడం తదితరమైనవన్నీ సెక్షన్ 3,4,5 కింద వస్తాయన్నారు. ఇవన్నీ శిక్షార్హమైనవేనన్నారు. కాని వ్యభిచార గృహాలకు వెళ్లే విటులపై కేసు నమోదు చేసే విధంగా చట్టంలో ఎక్కడా లేదన్నారు.
ఈ నేపథ్యంలో విటులు అంటే వ్యభిచార గృహాలకు వెళ్లే కస్టమర్లపై కేసు నమోదు చేయడమంటే చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో బాలికలను, వృద్ధులకు ఇచ్చి వివాహం చేయడం నేరమని పేర్కొన్నారని గుర్తు చేశారు. శ్రీశ్రీ కూడా ‘కవితా ఓ కవిత'లో వ్యభిచారిణుల బాధలను ఉదహరించారన్నారు. సామాజిక దురాచారాలను ఈ రచయితలు ఖండించారన్నారు. 1956 ఇమ్మోరల్ ట్రాఫిక్ (నిరోధక) చట్టం సరైనదేనని, కాని వ్యభిచారం చేసే స్ర్తిలు, దళారులు, వ్యభిచార గృహ యజమానులపై మాత్రమే కేసు పెట్టడం సరైన విధానం కాదన్నారు.
వ్యభిచార వృత్తిలో కీలకమైన కస్టమర్లపైన కేసులు నమోదు చేసే విధంగా చట్టం రావాలన్నారు. విటులు లేదా కస్టమర్లు తమ లైంగిక వాంచల కోసం వ్యభిచార గృహాలకు వస్తారని, వీరిపై కూడా కేసులు నమోదు చేసే విధంగా చట్టానికి సవరణ తేవాలన్నారు.