షాక్: మోడీపై చంద్రబాబు ఆగ్రహం: చూద్దాం.. లేదంటే గుడ్బై!
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పైన పెదవి విరిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రివర్గం నుండి తప్పుకునే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఆయన ప్రస్తుతానికి వేచిచూసే ధోరణిలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోడీ సర్కార్ తొలిపూర్తిస్థాయి బడ్జెట్ పైన చంద్రబాబు హతాశుడయ్యారు. శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో ఆర్థిక శాఖ అధికారులు, పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం పైన చంద్రబాబు ఒకింత కఠినంగానే మాట్లాడారని తెలుస్తోంది. రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్దామని, నచ్చచెప్పే ప్రయత్నం చేద్దామని చంద్రబాబు సూచించారు. మార్పు రాకపోతే ఆ మంత్రి పదవులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు విభజనను కోరుకోలేదని, తప్పని పరిస్థితుల్లో అంగీకరించవలసి వచ్చిందన్నారు.
వారిని ఆదుకొని నిలబెడతామని రెండు పార్టీలం కలిసి ఎన్నికల ముందు చెప్పామని, కానీ రెండో బడ్జెట్లో కూడా సాయం ప్రకటించకుంటే ఎలా అని అన్నారు. చేయని పాపానికి ఏపీని శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వచ్చి కలుస్తానంటే సమయమే ఇవ్వని పరిస్షితులు నెలకొన్నాయని, ఇంతకాలం తాను వీటి గురించి ఎక్కడా చెప్పలేదన్నారని తెలుస్తోంది. వారు సమయం ఇస్తేనే తాను వెళ్లి కలుస్తానని చెప్పారు.
కాగా, బడ్జెట్లో ఏపీ ప్రజల ఆశలను వమ్ము చేశారని చంద్రబాబు అంతకుముందు మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రెక్కలు విరిస్తే పరుగులు ఎలా అని, ప్రజలు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అని మోడీ చెప్పారని, పోలవరానికి వంద కోట్లు అంటే ఎన్నేళ్లకు అది పూర్తి అవుతుందని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చవలసిన బాధ్యత కేంద్రం పైన లేదా అన్నారు.
తాము ఏం పాపం చేశామని ప్రశ్నించారు. ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. కేంద్రం ఇలా చేస్తుందని ఊహించలేదన్నారు. నాడు కాంగ్రెస్ తమ మాట వినలేదని, ఇప్పుడు బీజేపీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కూడా బడ్జెట్ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు.