భార్యాపిల్లలతో వ్యాపారి అదృశ్యం: చంపి, ఆత్మహత్య చేసుకుంటానని లేఖ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో వ్యాపారి సుబ్బారావు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. తనతో పాటు భార్యా పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. ఆ కుటుంబం కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు చుట్టు పక్కల వెతికారు. ఆచూకీ లభించలేదు. చివరకు ఇంట్లో వెళ్లి చూడగా ఒక లేఖ లభ్యమైంది.
భార్యా పిల్లలను చంపి తాను చనిపోతానని లేఖలో రాసి ఉంది. బంధువులు, సుబ్బారావు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బారావు కుటుంబం అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసం
గల్ఫ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగదు, 210 పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. తమ డబ్బును తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంట్లో చోరీ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని విద్యానగర్లో గల ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 3.6 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తుంగభద్రలో పడి దంపతుల మృతి
తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలోని ఆలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు జారిపడి భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని బుధవారపేట కాలనీ వాసులుగా గుర్తించారు.