సీమ ప్రజలను మభ్యపెడుతున్నారు: బాబుపై సిఆర్
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని ఆయన అన్నారు.
సీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటే గాలేరు, నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు పోలవరం నుంచి జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబుతో ఎలాంటి మేలు జరగలేదని రామచంద్రయ్య దుయ్యబట్టారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బొత్సకు విమర్శించే హక్కు లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ నేత, మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ విమర్శించడంపై ఏపి డిప్యూటీ సీఎం చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే హక్కు బొత్సకు లేదని చినరాజప్ప స్పష్టం చేశారు.
వోక్స్ వ్యాగెన్ కుంభకోణంలో అవినీతిపరుడిగా ముద్రపడిన బొత్స.. చంద్రబాబును విమర్శించడటం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ శాఖ విభజన త్వరలో పూర్తవుతుందన్నారు. హుధుద్ ప్రభావిత జిల్లాల్లోరూ. 2200 కోట్లు నిధుల సాయానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని చిన రాజప్ప తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రపంచ బ్యాంక్ నిధులు వినియోగిస్తామని చినరాజప్ప చెప్పారు.