'పుష్కరాల డబ్బు తింటే పాపం తగులుతుంది', 'తొక్కిసలాట మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య అన్నారు. గోదావరి పుష్కరఘాట్లకు వెళ్లి పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్ధం అవుతుందని అన్నారు.
ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పుష్కరాల కోసం కేటాయించిన నిధుల వినియోగంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 'ఒకవేళ టీడీపీ నేతలు గనక పుష్కరాల డబ్బును మేసిఉంటే వారికి తప్పకుండా పాపం తగులుతుంది' అని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
గోదావరి పుష్కరాల్లో కేవలం కీర్తి కోసమే అంతా తానై చంద్రబాబు వ్వవహరించాడని మండిపడ్డారు. పుష్కరాలను సీఎం స్ధాయి వ్యక్తి కాకుండా, కలెక్టర్కు అప్పగించి ఉంటే సమర్ధవంతంగా నిర్వహించేవారని అన్నారు.
పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాలు అప్పగింత: బొత్స
రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి సంఖ్య ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే ఉండవచ్చనే అభిప్రాయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ వెలిబుచ్చారు.
చాలా మృతదేహాలకు పోస్టుమార్టం కూడా నిర్వహించకుండానే, వాటిని అలాగే సంబంధీకులకు అప్పగించారని మండిపడ్డారు. పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన చాలా దురదుష్టకరమని అన్నారు. బొత్స సత్యనారాయణ బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో కుటుంబంతో కలిసి పుష్కరస్నానమాచరించారు.