ఉండేదెవరు? ఊడెదెవరు? : టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోన్న కేబినెట్ విస్తరణ
విజయవాడ : ఎప్పుడు అనేది పక్కాగా ఇంకా నిర్ణయం కాకపోయినప్పటకీ.. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరగడం మాత్రం ఖాయమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న మంత్రులు.. కొత్తగా మంత్రివర్గంలో రావాలని ఆశిస్తోన్న నేతలు ఎవరికి వారు సొంత లెక్కల్లో మునిగిపోయారు.
పార్టీకి చెందిన సీనియర్లతో పాటు, వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. కేబినెట్ లో ఉండెదెవరు? ఊడెదెవరు? అన్న చర్చ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నేతల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా సీల్డ్ కవర్ ద్వారా డీ గ్రేడ్ పొందిన మంత్రులకు విషయం మరింత టెన్షన్ రేకెత్తిచేదిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే.. బలమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇందుకు తగ్గట్లుగా పార్టీకి మొదటినుంచి విధేయులుగా ఉంటూ.. పనితీరులోను చంద్రబాబు మన్ననలు పొందిన సోమిరెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి నేతలను కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు గుంటూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును కేబినెట్ లోకి తీసుకోవచ్చుననే చర్చ పార్టీలో అంతర్గతంగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో.. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేరా? అన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. మొత్తంగా.. మంత్రివర్గ విస్తరణ చేపడితే.. ఇప్పుడున్నవారిలో నలుగురు లేదా ఐదుగురిపై వేటు పడే అవకాశం లేకపోలేదు. ఇందులో ముఖ్యంగా.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, విజయనగరం, అనంతపురం, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రులపై వేటుపడే అవకాశమున్నట్లుగా లీకులు అందుతుండడంతో.. ఆయా నేతల్లో ఇప్పటినుంచే ఉత్కంఠ నెలకొన్నట్లుగా సమాచారం.
ఏదైమైనా టీడీపీ కేబినెట్ విస్తరణ.. కొందరికి అసంతృప్తిని మిగిలిస్తే, మరికొందరికి సంతృప్తిని మిగిల్చేదిగా మారనుంది. అంతిమంగా పార్టీ మైలేజీయే ముఖ్మం కాబట్టి.. ఈ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గే అవకాశం లేదు.