కాపురం చేయాలని కోర్టులు చెప్పలేవు: హైదరాబాద్ హైకోర్టు
హైదరాబాద్: ప్రైవేట్ వ్యక్తుల నిర్బంధంలో ఉన్న వ్యక్తులను కోర్టులో హాజరుపర్చాలని హెబియస్ కార్పస్ రిట్ను జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తనతో కాకుండా మరొక వ్యక్తితో కాపురం చేస్తున్న భార్యను తన దగ్గరకు పంపించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
హెబియస్ కార్పస్ రిట్ ద్వారా తన భార్యను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారం హెబియస్ కార్పస్ రిట్ పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది.
ఇలాంటి వ్యవహారాల్లో ఐపీసీ సెక్షన్ 497, 109ల కింద కేసులు నమోదు చేయవచ్చని పిటిషన్దారుడికి సూచించింది. అదే విధంగా కాపురం చేయాలని ఒత్తిడి చేసే అధికారం కోర్టులకు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా వ్యక్తులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన సమయంలోనే కోర్టు ముందు హాజరు పరచడానికి హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.