జాగ్రత్త: కేసీఆర్ని ఏకేసిన టీడీపీ హెచ్చరిక, రేవంత్పై కేసు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేతలు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాగుబోతైన ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎర్రబెల్లి దయాకర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ తన చేష్టలతో ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్నాడన్నారు. రానున్న రోజుల్లో తెరాస పార్టీని ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడేనని నిరూపిస్తే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కును నేలకు రాస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
నల్గొండ జిల్లాలో తమ పార్టీ కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు దాడి చేయడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే తెరాస భవన్ను భూస్థాపితం చేస్తారన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేతగాక ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీపై టీఆర్ఎస్ దాడి చేస్తోందన్నారు.
తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రతిపాదిస్తే... ఇంతవరకు తెరాస ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ చెబితే నిజమే అని నమ్మామని, ఇప్పుడు ఆయన మాయాబజార్ సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. రేపు నల్గొండ జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇకనైనా చంద్రబాబును విమర్శించడం మాని పాలన పైన దృష్టి సారించాలన్నారు.
అదిలాబాదులో ఉద్రిక్తం
అదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌక్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. విద్యుత్ కోతలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అదే సమయంలో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ తెరాస ఆందోళనకు దిగింది. కేసీఆర్ డౌన్ డౌన్ అని బీజేపీ అంటే, చంద్రబాబు డౌన్ డౌన్ అని తెరాస నినాదాలు చేసింది.
రేవంత్ రెడ్డి పైన కేసు
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదయింది. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుల పైన నిరాధార ఆరోపణలు చేశారని గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.