విమానాశ్రయంలో వీరంగం: వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డిలపై కేసు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది పైన దాడి చేసిన ఘటనకు సంబంధించి కడప జిల్లా రాజంపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో 13మందిపై కేసు నమోదైంది.
వారి పైన ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ప్రొటోకాల్ విషయంలో మిథున్ రెడ్డి ఎయిర్ ఇండియా మేనేజరు రాజశేఖర్తో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహించిన మిథున్ రెడ్డి మేనేజర్ రాజశేఖర్ పైమ దాడి చేశారు.
దాడి సమయంలోనే అక్కడే ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనుచరులు కూడా రాజశేఖర్ పైన దాడి చేశారు. దాడి ఘటనపై పౌరవిమానయాన శాఖ ఆదేశాలకు ఎయిర్ ఇండియా అధికారులు ఏర్పేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
కాగా, రేణిగుంట విమానాశ్రయంలో వైసిపి నేతలు గురువారం నాడు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంపీ మిథున్ రెడ్డి సహా పదమూడు మంది పైన కేసు నమోదు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ తెలిపారు. అయితే, తాను ఎవరి పైన దాడి చేయలేదని మిథున్ రెడ్డి చెబుతున్నారు.