సంక్షోభంలా కాదు, సమర్థత నిరూపించాలి: నోట్ల రద్దుపై చంద్రబాబు యూటర్న్!
రూ.500, రూ.1000 నోట్ల రద్దు, తదనంతర పరిణామాలను సంక్షోభంలా చూడకుండా, సమర్థతను నిరూపించుకునే అవకాశంగా ప్రతి ఒక్కరు భావించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దు, తదనంతర పరిణామాలను సంక్షోభంలా చూడకుండా, సమర్థతను నిరూపించుకునే అవకాశంగా ప్రతి ఒక్కరు భావించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంపై నిన్నటి దాకా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
ఆయన కన్వీనర్గా కేంద్రం కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలను సంక్షోభంలా కాకుండా, సమర్థతను నిరూపించుకునే అవకాశంగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. 2016తోనే ఈ సంక్షోభం సద్దుమణగాలని ఆకాంక్షించారు.
బాబుకు మరో బాధ్యత: సీఎంల కమిటీకి కన్వీనర్, విపక్షాలకు షాకిస్తూ కమిటీలోకి నవీన్
రద్దీ ఎక్కువ ఉన్న బ్యాంకుల వద్ద సిబ్బందిని పెంచి వినియోగదారులకు వసతులు కల్పించాలన్నారు. క్యాష్ కోసం ఎదురుచూడకుండా ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు మళ్లాలన్నారు. మొబైల్ కరెన్సీపై ప్రజలను చైతన్యపరచాలన్నారు.
వర్క్ షాపులు, అవగాహన సదస్సులు, శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. 2017 నూతన సంవత్సరం నూతన అధ్యాయానికి నాంది పలికాలన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఊరట
ఏపీ సచివాలయ ఉద్యోగులకు వేతనాలను నగదు రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు హైదరాబాదులోని ఎస్బీహెచ్లో ఉన్నాయి. దీంతో ఆ బ్యాంకుకు సంబంధించి తాత్కాలిక కౌంటర్ను అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఉద్యోగులు ఎస్బీహెచ్ కౌంటర్ వద్ద బారులు తీరారు.