ఎసిబి చార్టిషీట్లో పేరు: ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తన నివాసంలో ఆయన డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం అదనపు డిజి, పలువురు పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఎసిబి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. నోటుకు ఓటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దానివల్ల కూడా చంద్రబాబు ఉన్నతాధికారులతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంపై కూడా చంద్రబాబు ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా వివరాలు ఇవ్వాలంటూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఈ కేసు తదుపరి విచారణ ప్రక్రియను నిలిపేస్తూ ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తదుపరి కార్యాచరణపై కూడా చంద్రబాబు ఉన్నతాధికారులతో చర్చించినట్లు చెబుతున్నారు. నోటుకు ఓటు కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చింది.